Tuesday, 11 November 2025

జూబ్లీహిల్స్ బీఆర్‌యస్‌దే !!


ఫస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. 

ఇది డిజిటల్ యుగం. 

ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగింది అని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు. ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అలాంటి అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నాలుగు లక్షల వోటర్లు ఈ అవకాశాన్ని ఈరోజు ఆయుధంగా వాడుకోబోతున్నారు.  

నవంబర్ 14 నాడు ప్రపంచానికి ఒక నిజాన్ని చాలా స్పష్టంగా తెలియజేయబోతున్నారు... 

అజ్ఞానం, అసమర్థతలతో నిండిన రాజకీయం వేరు, రాష్ట్రాభివృద్ధి కోసం అహరహం శ్రమించే సంకల్పం ఉన్న రాజకీయం వేరు అని.
  
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కావాలి. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు గత పదేళ్లలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూశారు తెలంగాణ ప్రజలు. అంతకు ముందు అరవయ్యేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంగా, తెలంగాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసం చూశారు. అసలు ఈ ప్రాంత అభివృద్ధినే ఎగతాళి చేసిన అహంకారాన్ని చూశారు. 

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎవరు ఏంటి అన్నది వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.   

తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉద్యమశక్తిగా ఏం సాధించగలడో చూశాం. ఒక కొత్త రాష్ట్ర సారథిగా రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దగలిగాడో చూశాం. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, పదేళ్ళ తర్వాత మళ్ళీ శత్రుగణం అంతా అంతర్గతంగా ఒక్కటయి, "మార్పు" అనే మాయతో, వందల అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చగలిగారు.  

రాజకీయాల్లో మార్పు సహజం. కాని, ఆ మార్పు మంచి కోసం జరగాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కాని, గత రెండేళ్ళలో అలా జరగలేదు. మిగిలిన మూడేళ్లలో కూడా ఏదో జరుగుతుందన్న 'గ్యారంటీ' లేదు. జరిగేది ఒక్కటే - ఎప్పటికప్పుడుప్రజల్ని పక్కదారి పట్టించేలా - తెల్లారిలేస్తే కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, బీఆర్‌యస్‌ను ఆడిపోసుకోవడం, జుగుప్సాకరమైన భాషలో తిట్టడం. 

కాని, ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై-ఎలక్షన్ ఫలితాలు దీనికి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాయి. ఇంకో మూడేళ్ళ తర్వాతయినా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి తిరిగి పట్టాలెక్కడం కోసం, ఈ ఫలితాలు బీఆర్‌యస్‌కు అనుకూలంగా రావడం అత్యవసరం.            

కట్ చేస్తే - 

రాజకీయాలు రాజకీయాలే. తెలిసో తెలియకో అంతకుముందు జరిగిన చిన్న చిన్న పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ, పక్కా స్ట్రాటెజిక్ ప్రణాళికతో, కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్‌యస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేస్తున్న నిర్విరామ కృషి కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ పరిచయం చేసిన ఆధునిక ఆడియో-విజువల్ ఎన్నికల ప్రచార సరళి నిజంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక గొప్ప ప్రారంభానికి సూచన.  

తెలగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎవరు ఏం చేశారు అన్నది అంకెల్లో, గ్రాఫిక్స్ రూపంలో ఖచ్చితమైన ఆధారాలు, రిపోర్టులతో చూపించడం ద్వారా ప్రజలే అన్నీ తెలుసుకుంటారు. పచ్చి అబద్ధాలతో, వినడానికే సిగ్గనిపించే అపభ్రంశ భాషతో ఎవరు ఎంత ఊదరగొట్టినా, ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా గుడ్డిగా నమ్మి మోసపోవటం అనేది ఇకమీదట జరగదు. 

ఈ విషయంలో ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి తెరలేపిన కేటీఆర్‌ను అభినందించాల్సిందే. 

ఈ నేపథ్యంలో - తెలంగాణ రాష్ట్రాన్ని చాలా విషయాల్లో ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా అభివృద్ధిపథంలో నడిపిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌యస్ ఒక వైపు కాగా, అరవై ఏళ్ళపాటు తెలంగాణను ఒక వెనుకబడిన ప్రాంతంగానే నిలిపి, ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోగా, మళ్ళీ గత రెండేళ్ళుగా అదే అసమర్థతను కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు.  

జూబ్లీహిల్స్ లోని వోటర్లకు రావల్సినంత స్పష్టత వచ్చేసింది. రాజకీయంగా, సంక్షేమం పరంగా, అభివృద్ధిపరంగా బీఆర్‌యస్ ఏం చేయగలదు, కాంగ్రెస్ ఏం చేయగలదు అన్నది కూడా వారికి తెలుసు. 

గత ఎన్నికల్లో లాగా ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. 

జూబ్లీహిల్స్ ఇంతకుముందు కూడా బీఆర్‌యస్‌దే, ఇప్పుడు కూడా బీఆర్‌యస్‌దే అని జూబ్లీహిల్స్ వోటర్లు ఇప్పుడు తీర్పుచెప్పబోతున్నారు. 

- మనోహర్ చిమ్మని  

(ఈరోజు "నమస్తే తెలంగాణ" దినపత్రికలో వచ్చిన నా వ్యాసం.) 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani