137 సంత్సరాలుగా వెలువడుతున్న "నేషనల్ జాగ్రఫిక్" మ్యాగజైన్ కూడా 2024 లో మొత్తం స్టాఫ్ని తీసేసింది. న్యూస్ స్టాండ్ సేల్స్, షాప్ సేల్స్ లేవు. చందాదారులకు మాత్రమే అని చెప్తూ, ఎప్పుడు మూసేద్దామా అని చూస్తోంది, అన్ని వనరులు ఉండి కూడా!
ఇక మన తెలుగులో -
తెలుగు వెలుగు పత్రిక ఆగిపోయింది.
ఇండియా టుడే ఆగిపోయింది.
నవ్య వీక్లీ,
ఆంధ్రభూమి వీక్లీ, మంత్లీ,
ఆంధ్రపదేశ్ మంత్లీ,
చినుకు మంత్లీ,
ఆదివారం ఆంధ్రప్రభ...
ఆగిపోయాయి.
అంత పెద్ద సామ్రాజ్యం, అన్ని వనరులూ ఉన్న రామోజీరావు కూడా, దేశంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఆలోచించని విధంగా ఆలోచించి, ఎంతో అభిరుచితో ప్రారంభించి, మరెంతో కాలం లాభాపేక్ష లేకుండా నడిపిన చతుర, విపుల మాసపత్రికలు కూడా ఆపేశారు.
కట్ చేస్తే -
ఒక సాహితీ ప్రేమికుడు.
తెలుగు భాషా ప్రేమికుడు.
16 ఏళ్లక్రితం "పాలపిట్ట" సాహిత్య మాసపత్రిక ప్రారంభించాడు.
ఫిబ్రవరి 2010 లో పాలపిట్ట ప్రారంభమైంది. ఇప్పుడు మీరు పైన చూస్తున్నది ఫిబ్రవరి 2026 పాలపిట్ట సంచిక.
దీంతో "16 ఏళ్ళుగా దిగ్విజయంగా నడుస్తున్న ఏకైక సాహితీ మాసపత్రిక"గా దీనికి చాలా రికార్డులున్నాయి. బహుశా ఆ రికార్డులు ఈ పత్రిక ప్రారంభించిన ఈ సాహితీ ప్రేమికుడికి కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోడు.
21వ శతాబ్దంలో ఇంత సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఏకైక సాహిత్య మాసపత్రిక పాలపిట్ట మాత్రమే.
అది కూడా ఒకే ఒక్క మనిషి నడిపిస్తున్న పత్రిక.
వన్ మ్యాన్ ఆర్మీ.
మామూలుగా మంత్లీ అయినా, వీక్లీ అయినా... పత్రిక అంటే ఏదో చీప్ క్వాలిటీ న్యూస్ ప్రింట్తో అచ్చువేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. కాని, మంచి క్వాలిటీ పేపర్తో (మ్యాప్లితో పేపర్ అనుకుంటాను) తొలి సంచికను ఎలా ప్రచురించాడో, ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా ఆ పేపర్ క్వాలిటీ మారలేదు, తగ్గించలేదు.
మాసపత్రిక ఒక్కటే కాకుండా, పాలపిట్ట బుక్స్ పేరుతో ఇప్పటికి వందల్లో మంచి మంచి బుక్స్ కూడా పబ్లిష్ చేశాడు.
"కొంచెం కమర్షియల్గా వెళ్ళవయ్యా బాబూ... ఇంత ఖర్చు ఎందుకు?" అని ఎన్నోసార్లు నాలాంటివాళ్ళు చెప్పారు. ఆయన వినడు.
"నన్ను మార్కెటింగ్ & ప్రమోషన్స్ ఇంచార్జిగా పెట్టుకో. పత్రిక పేరుతో కార్యక్రమాలు చెయ్యి. సాహితీ అవార్డులివ్వు. లిటరరీ ఫెస్టివల్స్ చెయ్యి. ఆ సెక్షనంతా నేను చూసుకుంటాను. సంవత్సరానికో కోటో అరకోటో సంపాదించుకో. నీకోసం ఇదంతా ఫ్రీగా చేసి పెడతాను" అని నేనే స్వయంగా ఎన్నోసార్లు చెప్పాను. ఆయన వినడు. చిరునవ్వే ఆయన సమాధానం.
ఇదంతా ఆయన్ని పొగడ్డానికి రాయటం లేదు నేను. ఏక వ్యక్తి సైన్యంలా ఆయనొక్కడే ప్రారంభించి నడిపిస్తున్న పాలపిట్ట పత్రిక అప్పుడే 16 ఏళ్ళు పూర్తిచేసుకున్న విషయం తెలిసి, నా ఆనందం ఇలా పంచుకోవాలనుకుని ఇప్పటికిప్పుడు రాస్తున్నాను.
అంతే కాదు, మొన్నీ మధ్యే ఆయనకు వాళ్ళ సొంతూరు సూర్యాపేటలో ప్రేమగా ఒక అవార్డు ఇచ్చారు. కవిరాజ్ అవార్డు.
బహుశా మా రాందాస్ బలవంతం మీద ఆయన ఒప్పుకొని ఉంటాడు.
నాకు తెలిసి, ఇది ఆయన తీసుకున్న మొట్టమొదటి అవార్డు.
నిజానికి, తెలుగు భాష-సాహిత్యం-సాహితీ విమర్శ విషయంలో, ఒంటరిగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆయనకు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి అవార్డులివ్వాలి. అవార్డులు ఆయన్ని వెతుక్కొంటూ రావాలి.
దురదృష్టవశాత్తూ అలా జరగదు.
అవార్డుల వల్ల ఆయనకేదో వస్తుందని కాదు. ఆయన చేస్తున్న కృషి ఇంకో వందమందికో వెయ్యిమందికో తెలుస్తుంది. ఇంకొంతమంది తెలుగు ప్రేమికులు పత్రికకు పరిచయమవుతారు. ఆయన ఇంకొంత ఆనందిస్తాడు.
అంతే తప్ప, ఆయనెప్పుడూ అవార్డుల కోసం తపించలేదు. ప్రయత్నించలేదు. ప్రాధేయపడలేదు. అసలు అవార్డుల గురించి ఆలోచించలేదు.
16 ఏళ్ళుగా నిరాఘాటంగా, వన్ మ్యాన్ ఆర్మీలా ఈ పాలపిట్ట సాహితీ మాసపత్రికను నడిపిస్తున్న ఈయన మరెవరో కాదు...
సీనియర్ జర్నలిస్టు, రచయిత, విమర్శకుడు, ఉస్మానియా యూనివర్సిటీలో నా బ్యాచ్మేట్, నా హాస్టల్మేట్, నాకత్యంత ప్రియమైన మిత్రుడు... గుడిపాటి.
గుడిపాటి ఎమ్మే పొలిటికల్ సైన్స్ చేశాడు. గోల్డ్ మెడలిస్టు. నేను రెండు పీజీలు చేశాను. రెండు గోల్డ్ మెడల్స్.
గుడిపాటి పొలిటికల్ సైన్స్ చదివి సాహితీ సేవ చేస్తున్నాడు. నేను తెలుగు సాహిత్యం చదివి ఆవైపు విస్మరించాను.
అదంతా ఇంకో పోస్టులో రాస్తాను.
"ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు, సహకరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు" అని చిరునవ్వుతో సింపుల్గా చెప్పేసి తనకిష్టమైన పనిలో మునిగిపోయిన నా మిత్రుడు "గుడిపాటి" పాలపిట్ట మాసపత్రిక అత్యంత విజయవంతమైన 16 ఏళ్ల జర్నీ సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు.
- మనోహర్ చిమ్మని