మనకు బద్దకం ఎక్కువ. చిన్నా పెద్దా, ఉన్నవీ లేనివీ సమస్యల్ని తలచుకొంటూనే జీవితాల్ని ముగించేస్తాం. నేను రాసిన ఒక ఆధునిక జర్నలిజం పుస్తకం ఒక యూనివర్సిటీలో పీజీ స్థాయి సిలబస్లో "రికమండెడ్ బుక్స్" లిస్టులో ఉంది. సినిమా స్క్రిప్ట్ పైన నేను రాసిన మరో పుస్తకం నంది అవార్డు పొందింది. ఈ రెండూ బెస్ట్ సెల్లర్ బుక్సే. నేను అచ్చు వేసిన రెండు ఎడిషన్లూ టపటపా అయిపోయాయి. నవోదయ, విశాలాంధ్రవాళ్లు రీప్రింట్ మళ్లీ వేయండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేని బద్దకం! లేటెస్ట్ డెవెలప్మెంట్స్ని, నా అనుభవాల్నీ పొందుపరుస్తూ ఈ పుస్తకాల్నిరివైజ్ చేసి పబ్లిష్ చేయాలని నా ఉద్దేశ్యం. కాని ఆ పని ఒక దశాబ్దం గడిచినా నేను చేయలేకపోయాను! సంవత్సరం క్రితం ఓ పబ్లిషర్ మిత్రుడు నన్ను వేధిస్తోంటే ఇక పడలేక - వారం పాటు అదే పనిమీద కూర్చుని ఒక పుస్తకం రివైజ్ చేసి రాసిచ్చాను. ఆ పబ్లిషర్ మిత్రుడు ఇస్తానన్న డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. పుస్తకాన్నీ పబ్లిష్ చేయలేదు. ఇదొక రకం బద్దకం. ఈ మధ్య నా అవసరం కోసం మళ్లీ సినిమాల బిజీలో పడిపోయి ఈ బ్లాగ్ని కూడా మర్చిపోయాను. నాకు సంబంధించినంతవరకూ రైటింగ్ అనేది ఒక థెరపీ. రాయటం అలవాటు ఉన్నవాళ్లు దాన్ని మర్చిపోతే బ్రతకలేరు. తేడా తెలుస్తుంది. జీవితం ఉట్టి బ్రతుకైపోతుంది. జీన్ వుల్ఫ్ నుంచి జె కె రౌలింగ్ దాకా - ప్రపంచస్థాయి రచయితలందరూ నానా కష్టాలుపడుతూనే రాశారు. జీవితాన్ని జీవించారు. గౌరవించారు. రకరకాల కారణాలు నాకు నేనే చెప్పుకొంటూ, రోజుకు కనీసం ఒక్క పేజీ కూడా నేను రాయలేకపోతున్నానంటే నిజంగా ఇప్పుడు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇంక చాలు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. నాకత్యంత ప్రియమైన హాబీ అయిన రైటింగ్ని నేనెలా అంత సులభంగా మర్చిపోతాను? అయామ్ బ్యాక్ ... ఇంక కారణాలుండవ్. ఆలస్యాలుండవ్. అనుకున్నది చేసుకుంటూ ముందుకెళ్లడమే. నేను ఎప్పుడో రాసి, పూర్తిచేసిన 'కేసీఆర్' పుస్తకాన్ని ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాను.
రకరకాల షేపుల్లో, రకరకాల పేర్లతో మనం ఇప్పుడు తింటున్న పొటాటో చిప్స్కి ఆదిగురువు 1967 లోనే మార్కెట్లోకి వచ్చిన ప్రింగిల్స్. ఈ చిప్స్ ఇలా ఉండాలని ఊహించిన జక్కన్న లీపా.
కాగా, వీటికి ఆ షేప్లు తీసుకురావడానికి ఉపయోగించే మిషన్ను రూపొందించిన రామప్ప జీన్ వుల్ఫ్. ఇక్కడ విషయం చిప్స్ కాదు. జీన్ వుల్ఫ్ .. ఆయనకు తెలిసిన ఓ అతి పెద్ద రహస్యం ... కట్ టూ జీన్ వుల్ఫ్ - జీన్ వుల్ఫ్ మెకానికల్ ఇంజినీర్. రచయిత కూడా. జీన్కి తెలిసిన రహస్యం .. రోజుకు ఒకే ఒక్క పేజీ రాయడం. జీన్కు ఇప్పుడు 86 సంవత్సరాలు. అంటే సుమారు 31, 400 రోజులు. అందులో సగం రోజులు ఆయన ఒక సాధారణ రచయిత స్థాయి మెచ్యూరిటీకి ఎదగడానికి పట్టాయి అనుకొని తీసేద్దాం. తనకు తెలిసిన ఈ అతి చిన్న సీక్రెట్ను ఉపయోగించి, ఈ 15,700 రోజుల్లో ఆడుతూ పాడుతూ జీన్ రాసిన పుస్తకాల సంఖ్య 50. అవును అక్షరాలా 50 పుస్తకాలు! వీటిలో నవలలున్నాయి. బెస్ట్ సెల్లర్ బుక్స్ ఉన్నాయి. అవార్డ్ పొందిన పుస్తకాలూ ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఇదొక అద్భుతమయిన అచీవ్మెంటే. ఎందుకంటే జీన్ కేవలం రోజుకు ఒక్క పేజీ మాత్రమే రాస్తూ ఇది సాధించాడు!
ఎం పి గా పార్లమెంట్లో అది తన తొలి స్పీచ్. అయినా .. వెరీ కాన్ఫిడెంట్, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్. ఎలాంటి తడబాటు లేకుండా మంచి ఇంగ్లిష్లో దడదడలాడించేశారు. స్పీచ్లో అక్కడక్కడా ఓ రెండు మూడుసార్లు హిందీ కూడా తనకు బాగా వచ్చునని చెప్పకనే చెప్పారు. తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని, కె సి ఆర్ గారిని, అటు సోనియా గాంధీని, ఇటు సుష్మా స్వరాజ్ను గురించీ ప్రస్తావించారు. ప్రైమ్ మినిస్టర్ను, పార్లమెంట్లోని ఇతర పెద్దలనందర్నీ గౌరవిస్తూనే, అదే స్పీచ్లో అంటించాల్సిన చురకలన్నీ వరసపెట్టి అంటించారు కూడా:
ప్రెసిడెంట్ తన స్పీచ్లో కొత్తగా ఏర్పడిన 29 వ రాష్ట్రం అయిన తెలంగాణకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదన్నారు. పోలవరం గురించీ .. ఆర్డినెన్స్ ద్వారా ఏపిలో కలిపిన 7 మండలాల్లోని ఆదివాసీల సంక్షేమం కోసం చెయ్యాల్సిన దానిగురించి కూడా చెప్పారు. కట్ టూ కష్మీరీ పండిట్స్ - మరోసారి అదే పార్లమెంట్లో .. తన ఇంకో స్పీచ్లో .. కష్మీరీ పండిట్స్ గురించి దడదడలాడించేశారు ఇదే ఎం పి గారు. నాకు తెలిసి .. ఏపీ, తెలంగాణలకు సంబంధించిన ఎం పి లెవరూ పార్లమెంట్లో ఇప్పటివరకూ ఈ అంశం మీద అసలు మాట్లాడి ఉండరు అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడి ఉన్నా, ఖచ్చితంగా ఇంత లోతుగా సమస్యను అధ్యయనం చేసి ఉండరని నా గట్టి నమ్మకం. ఈ విషయంలో ఇంత నమ్మకంగా నేను చెప్పగలగడానికి కారణం కూడా ఒకటుంది. సీనియర్ మోస్ట్ ది గ్రేట్ అద్వానీ గారు లేచి, ఇదే అంశం గురించి తర్వాత మాట్లాడుతూ, అప్పటిదాకా మాట్లాడిన ఈ ఎం పి ని ఒకటికి నాలుగుసార్లు మెచ్చుకున్నారు. ఇటీవలే పార్లమెంట్లో నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ "ప్లీనరీ సెషన్"కు మాడరేటర్గా కూడా అద్భుతంగా వ్యవహరించి తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న ఈ తరం మహిళా ఎం పి లకు, రానున్న ఔత్సాహిక మహిళా ఎం పి లకు, మహిళా పొలిటీషియన్లకు తను ఒక ఐడల్, ఒక ఐకాన్ ... దటీజ్ మన ఎం పి. ఆ ఎం పి ఎవరో కాదు. కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సారథి. మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి కూతురు. కట్ టూ మన బంగారు బతుకమ్మ - ఒకప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించారు. తెలాంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ఎగతాళి చేశారు. ఆ బతుకమ్మ ఆడే తెలంగాణ ఆడబిడ్డల్ని అవహేళన చేశారు. అదిప్పుడు చరిత్ర. తెలంగాణ అవతరణకు ముందు కథ. తెలంగాణ జాగృతి ఏర్పాటుకు ముందు కథ. మరిప్పుడో? ఎక్కడ విన్నా "జై తెలంగాణ!" .. "జై కె సి ఆర్!" ఎక్కడ చూసినా .. బంతిపూలు, చామంతులు, నందివర్ధనాలు, తంగేడుపూలు, రంగులద్దిన గునుగు పూలు. ఆ పూలతో పేర్చిన బతుకమ్మలు. ఆ బతుమకమ్మలను ఆనందంగా ఆడే ఆడబిడ్డలు. అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. గిన్నిస్ రికార్డు బద్దలయ్యేలా! అంతేనా .. నో. ఒక్క తెలంగాణలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరిలోనూ అంబరాన్నంటిన ఇదే ఆనందం. ఒక్క రాజకీయంగానే కాదు. సాంస్కృతికంగా కూడా. దుబాయ్ నుంచి డెన్మార్క్ దాకా .. 17 రోజులు, 9 దేశాలు. అవిశ్రాంత తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ సంకల్ప యాత్ర. ఎక్కడికెళ్లినా తెలంగాణకు జేజేలు, మన బంగారు బతుకమ్మకు హార్దిక ఆహ్వానాలు. ది రినైజెన్స్ ఆఫ్ బతుకమ్మ .. మన బతుకమ్మకు మళ్లీ కళ వచ్చింది. ఈ కళ ఏ స్థాయిలో వచ్చిందంటే .. ఇప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డ గర్వంగా బతుకమ్మను పేర్చుతోంది. ఆడుతోంది. పాడుతోంది. పోటీలుపడి సెల్ఫీలు దిగుతూ ఫేస్బుక్ నిండా తన ఆనందాన్ని ఆవిష్కరిస్తోంది. మొన్నటి బతుకమ్మ పండుగకు ఫేస్బుక్ నిండా, బతుకమ్మలతో ఎన్ని లక్షల సెల్ఫీలు పోస్ట్ చేశారో ఒక్కసారి అలా గుర్తుకుతెచ్చుకోండి. "వావ్!" అని జకెర్బర్గే జెర్క్ తినేలా ! క్రెడిట్ గోస్ టూ .. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మన ఎం పి కవిత గారు. వారికివే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ...
రేపు జరగనున్న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా పోటీచేస్తున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, వారి ప్యానెల్ ఖచ్చితంగా గెలవబోతోంది. నా వైపు నుండి ఇంకో నాలుగు వోట్లయినా ఎక్కువ రావాలని తెలుగు డైరెక్టర్స్ యూనియన్లో లైఫ్ మెంబర్గా, ఒక బాధ్యతగా, ఈ చిన్న పోస్టు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో దాదాపు ప్రతి క్రాఫ్ట్కూ ఒక యూనియన్ ఉంది. వీటిలో దర్శకుల యూనియన్దే అత్యున్నత స్థానం. మొన్నటిదాకా ఆ స్థాయి విలువ కూడా వుండేది. అయితే ఈ మధ్యకాలంలో యూనియన్లోని కొంతమంది వల్ల నానా అవకతవకలు జరిగాయి. యూనియన్ స్థాయి దిగజారిపోయింది. జరిగిన ఎన్నో అవకతవకల్లో రెండు ఉదాహరణలు:
> అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయని, ఏ రకంగానూ అర్హతలేని 32 మందికి యూనియన్ ద్వారా చిత్రపురి కాలనీలో 32 ఫ్లాట్స్ ఇప్పించడం. > డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్నడూ పనిచేయని సుమారు 200 మంది ఇప్పుడున్న యూనియన్ మెంబర్స్ లిస్ట్లో ఉన్నారు! వీరికి రేపు ఎలక్షన్స్లో వోట్లు కాడా ఉన్నాయి(ట)!! ఇవి చాలనుకుంటాను శాంపుల్కి ... కట్ చేస్తే - రేపు ప్రెసిడెంట్గా గెలవబోతున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఇవ్వాళ ఒక్కటే మాట గట్టిగా చెప్పారు: "డైరెక్టర్స్ యూనియన్ ద్వారా చిత్రపురి కాలనీలో అక్రమంగా అలాట్ అయిన ఆ 32 ప్లాట్స్ సంగతి తేలుస్తాము. యూనియన్లో అర్హులైన మెంబర్స్కు వాటిని కెటాయిస్తాము. ఇలాంటి అవకతవకలు ఇంకెన్ని ఉన్నా, దేన్నీ వదిలిపెట్టము!" ఈ ఒక్క మాట చాలనుకుంటాను. ఎన్ శంకర్ గారి ప్యానెల్కు రేపు మనమందరం వోటెయ్యడానికి. ఆ సత్తా దర్శక మిత్రులు ఎన్ శంకర్ గారికి, వారి ప్యానెల్కు ఉంది. జరిగిన అవకతవకలను సరిదిద్దటం ఒక్కటే కాదు. దర్శకుల కోసం, యూనియన్ మెంబర్స్ కోసం ఇంకెన్నో అభివృద్ధి/సంక్షేమ సంబంధమైన పనులు చేయడానికి, దర్శకుల యూనియన్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించడానికి సిధ్ధంగా ఉన్న మన ఎన్ శంకర్ ప్యానెల్కు నాతోటి డైరెక్టర్స్ యూనియన్ మెంబర్స్ అందరూ వోటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రేపు సాయంత్రం 4 గంటలకు ఆ శుభవార్త వింటాము కూడా ...
కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారో లేదో ఆ కథ తర్వాత మాట్లాడుకుందాం ... అసలు కేసీఆర్ ఎందుకు భారత ప్రధాని కాకూడదు?
ఆయనకు లేని అర్హతలేమిటి? ఆయన్ను విమర్శిస్తున్నవాళ్లకు ఉన్న అర్హతలేమిటి? ముందు ఇది మాట్లాడుకొని, తర్వాత ఆ కథకొద్దాం. కట్ టూ ఆ నలుగురు -
రాష్ట్రంలో దాదాపు మట్టికొట్టుకుపోయిన వందేళ్ల చరిత్ర ఉన్న ఒక పార్టీలో ప్రతి ఒక్కరూ ఎవరికివారే ముఖ్యమంత్రి అభ్యర్థులు! వాస్తవిక దృష్టిలో, వచ్చే ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని సీట్లు వస్తాయన్నది ఎంత బాగా తెలిసినా, ఆ టెంటు నుంచి ఎప్పుడూ ఇవే జోకులు! ఆ పార్టీ తాజా జాతీయ అధ్యక్షుడు, 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కూడా. ఇక ఆ యువనాయకుడికున్న అర్హతలగురించి తెల్సుకోవాలంటే పెద్ద స్టడీ అవసరంలేదు. జస్ట్ గూగుల్లో ఆయన పేరు కొడితే చాలు. సెకండ్లో వెయ్యోవంతులో, అతనికున్న అర్హతలన్నిటి సారాంశాన్ని గూగులే ఒక్క ముక్కలో చెప్పేస్తుంది. ఇక కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న మరొక జాతీయపార్టీమీద ఎన్నో ఆశలతో, మస్త్ మెజారిటీతో ప్రజలు పట్టం కడితే ఏం జరిగిందో .. సామాన్యప్రజలకు ఏం ఒరిగిందో .. ఇప్పటికే అందరికీ బాగా తెలిసివచ్చింది. ఎన్నికలెప్పుడెప్పుడా అని జనం ఎదురు చూస్తున్నారు, తగిన జవాబివ్వడానికి! ఆ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడున్న నాలుగైదు స్థానాలు నిలబెట్టుకోవడమే చాలా కష్టం అన్న వాస్తవం వాళ్లకూ తెల్సు. అయినాసరే, "2019లో మేమే స్వీప్ చేస్తాం" అంటున్నారు! వీళ్లు ఇంతకు ముందు ఏం స్వీప్ చేశారో, ఇప్పుడేం స్వీప్ చేస్తారో అందరికి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అంతరించిపోయిన మరొక పార్టీ, దాని తాలూకు శకలాలు ఒకటి రెండు ఎప్పుడూ ఏవేవో సంధి ప్రేలాపణలు పేల్తుంటాయి. పక్కరాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ నాయకుడు, వృద్ధాప్యంలో వచ్చే ఒక విచిత్రమైన "బాల ఖ్యాలి" ని మించి .. అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే కనిపెట్టాను, అన్నిటి వెనుక నేనే కారణం .. అని అర్థం పర్థం లేకుండా డబ్బా కొట్టుకుంటుంటాడు. అసలు నేను ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాడ్ని.. మా అబ్బాయి వద్దు అంటే ఊరుకున్నానంటాడు! అంత విలువైన సలహా ఇచ్చిన ఆ అబ్బాయికి కూడా గూగుల్తో కనెక్షన్ ఉండటం ఇక్కడ విశేషం. పైన చెప్పుకున్న మూడు పార్టీలను మూడు యూనిట్లు అనుకొంటేగాని, నాలుగో యూనిట్కు క్లారిటీ రాదు! ఈ నాలుగో యూనిట్లో ముక్కలుముక్కలుగా ఇంకో మూడు 'సబ్ యూనిట్' లున్నాయి: సత్తా చూపించలేక లోకం వదిలిపెట్టిన పార్టీ ఒకటి. ప్యాకేజీ పధ్ధతిలో అప్పుడప్పుడూ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ, అవగాహనలేని ప్రశ్నలే తప్ప, ఎన్నటికీ ఎలక్షన్లలో పోటీచేసే ఊసే లేని ఫ్యాన్స్ పార్టీ ఒకటి. రంగు పూర్తిగా వెలిసిపోయినా ఇంకా మేం కూడా రంగంలోనే ఉన్నాం అన్న భ్రమలో బతుకుతున్న పార్టీలు రెండు. ఇవన్నీ ఈ నాలుగో యూనిట్ కిందకొస్తాయి. ఈ యూనిట్ గురించి ఇంతకు మించి మాట్లాడుకోవడం అనేది అనవసరంగా వాళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టవుతుంది. కాబట్టి ఇంక చెప్పుకునేదేం లేదిక్కడ. కట్ చేస్తే - ఇక్కడొక లయన్ ఉంది. దాని పేరు కేసీఆర్! ఒక ఉద్యమపార్టీ పెట్టి, ఆ ఉద్యమ నాయకునిగా 60 ఏళ్లుగా ఎవ్వరూ సాధించలేని ఒక రాష్ట్రాన్ని సాధించిపెట్టిన అనుభవం ఉంది. రాష్ట్ర అవతరణ తర్వాత .. దాని ముఖ్యమంత్రిగా "ఉద్యమం వేరు, రాజకీయం వేరు" అన్న స్పష్టతతో, ఒక కొత్త రాష్ట్రాన్ని దాని అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా గత నాలుగేళ్లుగా విజయవంతంగా పాలిస్తున్న అనుభవం ఉంది. గత అరవై ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుని ఊహకు కూడా అందని పథకాలను ప్రవేశపెడుతూ, వాటి ఫలితాలు ప్రజలకు నేరుగా అందేలా చేస్తున్న రికార్డు ఉంది. నీటి విలువ తెలుసు. రైతు విలువ తెలుసు. సామాన్య ప్రజల జీవితం తెలుసు. వారి జీవితాల్లోని చీకటివెలుగులు తెలుసు. వృద్ధుల అవసరాలు తెలుసు. వారిని పట్టించుకోవడం విస్మరిస్తున్న నేటి సమాజం తెలుసు. సమస్యల మూలాలు తెలుసు. వాటినెలా సరిదిద్దాలో తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అవసరమైతే కొంత తగ్గి అయినా పని సాధించుకోవడం తెలుసు. అంతేనా ... స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలన్న కోరికలు ఆయనలో అసలు లేవు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగల సామర్థ్యం ఉంది. "వ్యవసాయం వ్యాపారం కాదు. ఒక జీవనవిధానం" అని చెప్పగల మేధావిత్వం ఆయన సొంతం. రాష్ట్రంలోనేకాదు, దేశంలో కూడా ఉన్న ప్రతి చిన్నా పెద్ద సమస్య మీద, వాటి పరిష్కారం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి ప్రాంతం భౌగోళిక అంశాలమీద అవసరమైతే గణాంకాలతో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగల శక్తి ఉంది. ఆసక్తి ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వం కోల్పోయిన ఎన్నో చిన్న చిన్న దేశాలు ఎంతో త్వరగా అభివృద్ధి చెందినా, ఇంత జనాభా ఉండి, ఇన్ని రిసోర్సెస్ ఉండి, 70 ఏళ్లుగా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందే అన్న ఆక్రోశం ఉంది. రాజకీయం అనేది ప్రజల బాగోగులను పట్టించుకోలేని ఒక రొటీన్ అయిపోయిందే అన్న బాధ ఉంది. ఈ రొటీన్ ను బ్రేక్ చేయాలన్న తపన ఉంది. ఎమ్మెల్లేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా .. రాజకీయరంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. అన్నిటినీ మించి ఆయనలో ఒక మానవీయ కోణం ఉంది. ఇప్పుడు దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అధినేతతో పోల్చుకున్నా, ఏ రాజకీయనాయకునితో పోల్చుకున్నా, ఏ విషయంలోనూ కేసీఆర్ తక్కువ కాదు. చాలా ఏళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఒక విభిన్న, సంపూర్ణ రాజకీయనాయకున్ని చూస్తున్నాము. ఇలాంటి రాజకీయనాయకుడు దేశ ప్రధాని కావడానికి ఇంకేం అర్హతలు కావాలి?